ఢిల్లీ : రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. 127వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టుచే తిరస్కరించబడిన రాష్ట్రాల హక్కులు ఈ బిల్లు ద్వారా తిరిగి పునరుద్ధరించబడనున్నట్లు ఆయన తెలిపారు. ఓబీసీ బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. బిల్లు ఉభయ సభల ఆమోదం పొందడంతో ఇకపై రాష్ట్రాలు సొంతంగా ఓబీసీ జాబితాను రూపొందించుకునేందుకు వీలు ఏర్పడింది. ఓబీసీ బిల్లుకు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.