న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై లోక్సభ ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ముందు లోక్సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో డిమాండ్ చేశారు. పోస్టాఫీస్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. 125 ఏళ్ల నాటి ఈ చట్టాన్ని సవరించడం వల్ల ప్రభుత్వానికి కీలక అధికారాలు లభిస్తాయి. దేశ భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, శాంతిభద్రతలు, అత్యవసర పరిస్థితులు లేదా ప్రజా భద్రత వంటి సందర్భాల్లో ఏదైనా వస్తువు లేదా కవరును తెరచి చూసి, స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు లభిస్తుంది. దీని కోసం ఏదైనా అధికారికి అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వవచ్చు.
దేశ భద్రత కోసమే ఈ నిబంధనలను ఏర్పాటు చేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ బిల్లును వామపక్షాలు, ఆప్, టీడీపీ, ఏఐఏడీఎంకే, ఎన్సీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్సిళ్లను తెరచి చూసే అధికారాన్ని పోస్టల్ అధికారికి కట్టబెట్టడం వల్ల వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘనకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, లీగల్ ప్రొఫెషన్ను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కోర్టుల్లో న్యాయవాదులు-కక్షిదారుల మధ్య దళారులను తొలగించాలని పార్టీలకు అతీతంగా ఎంపీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.