న్యూఢిల్లీ: రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే, ఆ 12 మంది ఎంపీలు క్షమాపణ చెబితే తప్ప సస్పెన్షన్ ఎత్తివేసేది లేదని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. దాంతో సభలో తొలిరోజు నుంచి గందరగోళం కంటిన్యూ అవుతున్నది. ఇవాళ కూడా ఉదయం సభ ప్రారంభం కాగానే 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
రాజ్యసభ ఛైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విపక్షాలు వినిపించుకోలేదు. దాంతో ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో సభాపతి సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా 12 మంది సభ్యులు సభా నిబంధనలను ఉల్లంఘించారంటూ.. శీతాకాల సమావేశాల మొదటిరోజే వారిని సస్పెండ్ చేశారు.