న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ వ్యవహారం పార్లమెంట్ను ఇంకా కుదిపేస్తోంది. సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణ, బోర్డర్ వివాదంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో శుక్రవారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంపై సమగ్ర చర్చ జరపాలని విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి.
ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రతిపక్షాలు సభలో విరుచుకుపడటంతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ వాయిదా పడింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఎల్ఏసీ వద్ద ఇటీవల జరిగిన ఘర్షణలపై మాట్లాడారు. తవాంగ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానని తనను మాట్లాడేందుకు ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు.
మరోవైపు సభా కార్యక్రమాలను రద్దు చేసి ఇండియా-చైనా సరిహద్దు వివాదం, సైనికుల ఘర్షణపై చర్చ చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు రణ్దీప్ సుర్జీవాలా రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. ఇక చైనాతో సరిహద్దు వివాదం నేపధ్యంలో ఎల్ఏసీ పరిస్ధితిపై చర్చకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు నిరుద్యోగంపై చర్చించాలని కాంగ్రెస్ నేత రంజిత్ రంజన్ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.