చైనా, పాక్ విషయంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇంకా రాజకీయ వేదికపై నానుతూనే వున్నాయి. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో సహా, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ ప్రచారంలో కూడా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. భారత సైనికుల పరాక్రమానికి రాహుల్ గాంధీ విలువ ఇవ్వరని, సైనికుల పరాక్రమాన్ని విశ్వసించరని తీవ్రంగా మండిపడ్డారు. చైనా మీడియానే నమ్ముతారని, చైనా మీడియాపైనే రాహుల్ ఎక్కువగా ఆధారపడతారని రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఆక్షేపించారు. భారత దేశం ఇప్పుడు అత్యంత బలవంతమైన దేశమని, ఈ విషయం ఇప్పటికే ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు. సరిహద్దులను దాటిమరీ.. శత్రువుల పీచమణచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గాల్వాన్ ఘర్షణలో భారత సైనికులే చాలా మంది వీర మరణం పొందారని, చైనా వాళ్లు తక్కువ మందే చనిపోయారని పేర్కొన్నారు. రాహుల్ చైనా మీడియానే ఎక్కువగా నమ్ముతారు. 38 నుంచి 50 మంది చైనా సైనికులు గాల్వాన్ ఘర్షణలో చనిపోయారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. భారత ఆర్మీ పరాక్రమంపై రాహుల్కు విశ్వాసం లేదు అని రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.
శాంతిభద్రతల విషయంలో యోగి సక్సెస్ : రాజ్నాథ్
యూపీలో శాంతిభద్రతల విషయంలో సీఎం యోగి సక్సెస్ అయ్యారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కితాబునిచ్చారు. క్రిమినల్స్ రాష్ట్రం విడిచి పోయేలా చేశారని, వారి ఆస్తులను కూడా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. యూపీ అభివృద్ధి పథంలో సాగుతోందని, రోడ్ల పరిస్థితి కూడా చాలా మెరుగైందని రాజ్నాథ్ పేర్కొన్నారు.