ఢిల్లీ, ఏప్రిల్ 10: లోక్సభ ఎన్నికల వేళ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఇప్పటికే సతమతమవుతున్న ఆమ్ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ మంత్రి రాజ్కుమార్ ఆనంద్ బుధవారం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆప్లో దళితులకు ప్రాతినిథ్యం ఇవ్వడం లేదని, పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ క్యాబినెట్లో రాజ్కుమార్ సాంఘిక సంక్షేమ శాఖతో పాటు పలు ఇతర శాఖలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో రాజ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆప్ అగ్రనేతల్లో ఒక్క దళితుడు కూడా లేరన్నారు. పార్టీలో దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లకు గౌరవం లేదని ఆరోపించారు. కేజ్రీవాల్ను ఉద్దేశించి కూడా విమర్శలు చేశారు. ఒకసారి రాజకీయాలు మారితే, దేశం మారుతుందని గతంలో జంతర్మంతర్ వేదికగా కేజ్రీవాల్ చెప్పారని, అయితే ‘రాజకీయాలు మారలేదు, రాజకీయ నేతలే మారారు’ అంటూ వ్యాఖ్యానించారు.
మంత్రి రాజీనామాపై ఆప్ స్పందించింది. తమ పార్టీని అంతం చేసే లక్ష్యంలో భాగంగా కేజ్రీవాల్ను అరెస్టు చేశారన్న తమ వాదనకు తాజా పరిణామం బలాన్నిచ్చిందని పేర్కొన్నది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ సీబీఐ, ఈడీ సంస్థలను ఉపయోగించుకొని తమ మంత్రులు, ఎమ్మెల్యేల్లో చీలిక తేవాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఇది ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్షా సమయం అని వ్యాఖ్యానించారు. తమ పార్టీని చీల్చేందుకు చేసే కుట్రలకు వ్యతిరేకంగా బలంగా నిలబడుతామని పేర్కొన్నారు. గతంలో ఈడీ దాడుల సమయంలో అవినీతిపరుడు అంటూ విమర్శించిన రాజ్కుమార్ ఆనంద్ను.. ఇప్పుడు అదే బీజేపీ ఆయన్ను పూలమాలతో వాళ్ల పార్టీలోకి ఆహ్వానిస్తుందని అన్నారు. ఆప్ నుంచి బయటకు రావాలని ఆనంద్ను ఎవరైనా బెదిరించి ఉండొచ్చని మంత్రి భరద్వాజ్ అన్నారు.
మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. స్పందించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వీలైనంత త్వరగా పిటిషన్ను లిస్టింగ్ చేసేందుకు పరిగణనలోకి తీసుకొంటామన్నారు. మరోవైపు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ను తొలగించాలని పదేపదే పిటిషన్లు దాఖలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇదేమైనా జేమ్స్ బాండ్ సినిమానా? సీక్వెల్స్ ఉండటానికి..’ అని వ్యాఖ్యానించింది. ఈ విధమైన పిటిషన్లను పదేపదే ఎందుకు వేస్తున్నారని పిటిషన్దారుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై వచ్చిన పిటిషన్లపై ఇప్పటికే విచారణ చేశామని, సీఎం తొలగింపు అంశం కార్యనిర్వాహక పరిధిలోకి వస్తుందని, దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకొంటారని స్పష్టం చేసింది.