జైపూర్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సహా 9 మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక మహిళ (Rajasthan Woman) ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది. ఐదేళ్ల కిందట తన తండ్రి అనారోగ్యం బారినపడటంతో బార్మర్కు చెందిన రామ్ స్వరూప్ను కలిసినట్లు మహిళ తెలిపింది. ఆయన లైంగిక దాడికి పాల్పడటంతోపాటు దానిని రికార్డ్ చేశాడని ఆరోపించింది.
కాగా, బార్మర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవరం జైన్ను రామ్ స్వరూప్ 2021లో పరిచయం చేశాడని, నాటి నుంచి రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. తన టీనేజ్ కుమార్తెను లైంగికంగా వేధించారని, తన స్నేహితురాలిపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు మరింత మంది అమ్మాయిలను తీసుకురావాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించింది. ఈ విషయాన్ని వెల్లడించకుండా ఉండేందుకు పోలీసు అధికారులు, ఇతర వ్యక్తులు తనను బెదిరించారని, ఖాళీ కాగితాలపై బలవంతంగా సంతకం చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు మహిళ ఫిర్యాదుపై జోధ్పూర్లోని రాజీవ్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదు చేశారు. బార్మర్ మాజీ ఎమ్మెల్యే మేవరం జైన్, ఆర్పీఎస్ అధికారి ఆనంద్ సింగ్ రాజ్పురోహిత్, ఇద్దరు పోలీస్ అధికారులైన బార్మర్ ఎస్హెచ్వో గంగారామ్ ఖావా, ఎస్ఐ దావూద్ ఖాన్, ప్రధాన్ గిర్ధారి సింగ్ సోధా సహా 9 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
కాగా, 2022 నవంబర్లో బార్మర్ పోలీసులను రామ్ స్వరూప్ ఆశ్రయించాడు. లైంగిక ఆరోపణల పేరుతో తనను బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేశారని ఇద్దరు మహిళలతో సహా ఐదుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేయడంతోపాటు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు మేవరం జైన్కు సంబంధించిన సీడీ, ఫొటోలు ఏడాది కిందట బయటపడ్డాయి. అయితే మార్ఫింగ్ చేశారంటూ బార్మర్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కాగా, ఈ కేసులో ఐదు కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద జైపూర్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.