జైపూర్: రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి, తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ ఆరోపించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ఆదివారం ఉదయం జైపూర్ చేరుకున్నారు. 15 మంది పోలీసులు రోహిత్ కోసం మంత్రి మహేష్ జోషికి చెందిన రెండు నివాసాలకు వెళ్లారు. రోహిత్ అక్కడ లేకపోవడంలో ఆ ఇళ్ల వద్ద సమన్ల నోటీసు అంటించారు. రేప్ కేసుపై విచారణకు మే 18లోగా హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. పరారీలో ఉన్న రోహిత్ ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ అధికారి తెలిపారు.
రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషిపై 23 ఏళ్ల మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. గత ఏడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 17 వరకు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోహిత్ జోషితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. తొలిసారి కలిసినప్పుడు డ్రింక్లో మత్తు మందు కలిపి తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపించింది. మరునాడు తన నగ్న ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించి, బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గత ఏడాది ఆగస్ట్ 11న గర్భం దాల్చినట్లు తెలియడంతో అబార్షన్ మాత్ర వేసుకోవాలని రోహిత్ బెదిరించినట్లు ఆరోపించింది.
కాగా, ఆ మహిళ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఢిల్లీలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాసంలో కూడా రోహిత్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో సంబంధిత సెక్షన్ల కింద పూర్తి స్థాయిలో కేసు నమోదు చేశారు. రోహిత్ను అరెస్ట్ చేసి ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేశారు.
మరోవైపు తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి ఖండించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రగా విమర్శించారు. వాస్తవం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తెలుస్తుందని మీడియాతో అన్నారు.