జైపూర్, జూలై 22: ‘రాజస్థాన్లో మహిళలపై లైంగికదాడులు ఎక్కువవుతున్నాయి. బాలికలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలపై లైంగికదాడుల్లో రాజస్థాన్ ముందంజలో ఉందనడానికి రాష్ట్రంలో తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న లైంగికదాడి ఘటనలే నిదర్శనం. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై నోరు మెదిపినందుకే నన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు’ అని కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లోని సొంత ప్రభుత్వంపై క్యాబినెట్ మంత్రి రాజేంద్రసింగ్ గుఢ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులపై మాట్లాడిన రాజేంద్రసింగ్ను మంత్రి పదవి నుంచి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తప్పించింది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని అసత్య ఆరోపణలు చేసే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజస్థాన్లో జరుగుతున్న దారుణాలు కనిపించడం లేదని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నారు. ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదని పలువురు మండిపడుతున్నారు.