జైపూర్: వివాదస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) దేశంలోని పలు చోట్ల ఘర్షణలకు దారి తీస్తున్నది. ఈ సినిమాను యువతులు చూడాలంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ సభ్యుడు వాట్సాప్లో పోస్ట్ చేశాడు. దీనిపై ఆగ్రహించిన కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ సంఘటన జరిగింది. వీహెచ్పీ, భజరంగ్ దళ్ సభ్యుడైన 24 ఏళ్ల అభిషేక్ శుక్రవారం ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూశాడు. ఆ సినిమా పోస్టర్ను వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. సినిమా చాలా బాగుందని పేర్కొన్నాడు. ఇస్లాం మతంలోకి మారడం నుంచి సురక్షితంగా ఉండేందుకు ప్రతి యువతి ఈ సినిమాను తప్పక చూడాలని అందులో కోరాడు. ఈ నేపథ్యంలో అతడికి వాట్సాప్లో బెదిరింపు సందేశాలు వచ్చాయి.
కాగా, శనివారం రాత్రి అభిషేక్ తన ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతడ్ని అడ్డుకున్నారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా గురించి వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేయడంపై ప్రశ్నించారు. తమ మతాన్ని అవమానించినట్లు వారు ఆరోపించారు. అయితే తాను తప్పుగా పోస్ట్ చేయలేదని అభిషేక్ చెప్పాడు. వారిని తన ఇంటి వద్దకు తీసుకెళ్లి మొబైల్ ఫోన్ను చూపించాడు. ఆ పోస్ట్ చూసిన ఆ ముగ్గురు వ్యక్తులు అభిషేక్పై దాడి చేశారు. అతడ్ని కొట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో అభిషేక్ ఫిర్యాదు చేశాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న వీహెచ్పీ, భజరంగ్ దళ్ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. తమ సభ్యుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, అభిషేక్పై దాడి చేసిన వ్యక్తులను పింటూ, అమన్, అలీగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు మైనర్ అని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.