జైపూర్: పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి వధువు పారిపోయింది. అయితే వరుడు (Rajasthan groom) మాత్రం 13 రోజులుగా వధువు ఇంటి వద్ద ఉన్న పెళ్లి మండపంలోనే ఉన్నాడు. ఆమె తిరిగి వచ్చే వరకు పెళ్లి దుస్తులు కూడా తొలగించలేదు. చివరకు ఆ మహిళను పెళ్లాడిన అతడు తన ఇంటికి తిరిగి వెళ్లాడు. విస్తూపోయే ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది. ఈ నెల 3న సైనా గ్రామానికి చెందిన మనీషాతో శ్రావణ్ కుమార్కు పెళ్లి జరుగాల్సి ఉంది. వరుడిగా ముస్తాబైన శ్రావణ్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వధువు మనీషా ఇంటికి చేరుకున్నాడు. కొంత పెళ్లి తంతు జరిగిన తర్వాత వికారం, కడుపులో తిప్పుతుందంటూ పెళ్లికుమార్తె మనీషా ఇంటి వెనక్కి వెళ్లింది. ఆ తర్వాత బావ భరత్ కుమార్తో కలిసి పారిపోయింది.
కాగా, వధువు మనీషా ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం అంతా వెతికారు. చివరకు బంధువైన వ్యక్తితో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు గ్రహించారు. ఈ విషయం తెలిసిన పెళ్లికుమారుడు శ్రావణ్ మాత్రం ఆ పెళ్లి మండపాన్ని వీడలేదు. తలపై పాగాతోపాటు పెళ్లి దుస్తుల్లో 13 రోజులుగా అక్కడే వేచి ఉన్నాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు వధువు మనీషా కోసం వెతికారు. ఈ నెల 15న ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో పారిపోయిన పెళ్లి కుమార్తె కోసం 13 రోజులుగా ఆమె ఇంటి వద్ద పెళ్లి మండపంలో వేచి ఉన్న వరుడు శ్రావణ్ కుమార్, చివరకు ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి తన ఇంటికి తిరిగి వెళ్లాడు.