జైపూర్: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కాలుమోపింది. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ వేరియంట్ ప్రభావం ఉన్నది. తాజాగా రాజస్థాన్లో ఒకేరోజు 23 మంది ఒమిక్రాన్ వేరయంట్ బారినపడ్డారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరింది. రాజస్థాన్ ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.
కాగా, ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వేరయింట్ ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఆంక్షలను కఠినతరం చేసింది. ఇదిలావుంటే బుధవారం ఉదయం వరకు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,195 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అన్ని వేరియంట్లు కలిపి దేశంలో 77,002 యాక్టివ్ కేసులు ఉన్నాయి.