Assistance to transgenders | ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు, అభ్యర్థులు పడరాని పాట్లు పడుతుంటారు. అయితే, రాజస్థాన్లోని గెహ్లాట్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ.. ట్రాన్స్జెండర్ ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నది. వారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించే పథకానికి అక్కడి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందే ట్రాన్స్జెండర్లు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు నిలుస్తారని అక్కడి ప్రభుత్వం ఆశిస్తున్నది. ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చి ఆర్థిక సాయం అందజేస్తున్న మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలువనున్నది.
రాజస్థాన్లో దాదాపు 20 వేల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరిలో లింగమార్పిడి చేయించుకోవాలని ఆశించేవారికి ఆర్థిక సాయం అందించాలని అక్కడి గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లింగ మార్పిడి కోరుకునే వారికి ఉచిత సర్జరీలు చేయించడంగానీ, రూ.2.50 లక్షల నగదు గానీ అందిస్తుంది. ఇందుకోసం రూ.10 కోట్ల నిధులతో ‘ఉత్థాన్ కోష్’ ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఓంప్రకాశ్ తోష్నివాల్ ధ్రువీకరించారు. ఆసక్తి చూపే ట్రాన్స్జెండర్లు సామాజిక సాధికారత న్యాయ విభాగంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.