జైపూర్: ఇంటి నుంచి అదృశ్యమైన బాలికను ఒక వ్యక్తి హోటల్ యజమానికి అమ్మేశాడు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు 30 మందికిపైగా వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో పలువురు హోటల్ యజమానులు, నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. (girl raped by 30 men) రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలిక తన ఇంటి నుంచి అదృశ్యమైంది. రిక్షా లాగే వ్యక్తి ఆమెను ఒక హోటల్ యజమానికి విక్రయించాడు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు పలు హాటల్స్లో ఆ బాలికపై లైంగిక దాడి జరిగింది. సుమారు 30 మందికిపైగా వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాధిత బాలిక ఈ దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదేపదే జరిగిన అత్యాచారాల వల్ల కలిగే బాధను భరించలేనప్పుడు తనతో బలవంతంగా మద్యం తాగించారని ఆమె ఆరోపించింది. దీంతో పోస్కో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు హోటల్ యజమానులు, నిర్వాహకులను అరెస్టు చేశారు.
మరోవైపు ఈ నేర సంఘటన బయటకు రాకుండా అణచివేసే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. శ్రీ గంగానగర్ ప్రముఖ పర్యాటక ప్రాంతం కానప్పటికీ 150కు పైగా అక్రమ హోటళ్లు ఉన్నాయని స్థానికులు ఆరోపించారు. వాటిని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ కూడా నిరసనలో పాల్గొన్నది. రిక్షా లాగే వ్యక్తితో పాటు హోటల్ నిర్వాహకులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత పోలీస్ స్టేషన్కు చెందిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.