అజ్మీర్: గ్యాస్ ట్యాంకర్, లారీ ఎదురెదురుగా వెళ్తూ వేగంగా ఢీకొనడంతో ఘోరం జరిగిపోయింది. గ్యాస్ ట్యాంకర్ పేలిపోయి ఒక్కసారిగా రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో.. వాటిలో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
రెండు భారీ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగానే ట్యాంకర్ పేలిపోయి మంటలు అంటుకున్నాయని, ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో ఆ రెండు వాహనాల్లో ఉన్న నలుగురు తప్పించుకోవడానికి అవకాశం లేకుండాపోయిందని, దాంతో సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. ట్యాంకర్లోని పెట్రోలియం గ్యాస్ చిల్లడంతో ఆ సమయంలో ఆ మార్గం గుండా వెళ్తున్న ఇతర వాహనాలకు, సమీపంలోని ఇండ్లు, దుకాణాలకు కూడా స్వల్పంగా మంటలు అంటుకున్నాయని చెప్పారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి తాము హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నామని, మంటలను ఆర్పవేశామని తెలిపారు. కాగా, ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ అన్షుదీప్, ఎస్పీ చునారామ్ కూడా ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.