జైపూర్: దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలు ఆయనలో స్వల్పంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా సోకిందని, డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులపాటు ఇంటి నుంచే పనిచేస్తానని గెహ్లాట్ ప్రకటించారు.
కరోనాపట్ల రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహమ్మారి మరింత విస్తరించకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఒక ప్రకటన చేశారు. కాగా, అశోక్ గెహ్లాట్ నిన్న సూరత్లో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీని కలిశారు. ఆ సభ కోసం వచ్చిన రాహుల్, ప్రియాంకలకు గెహ్లాటే స్వాగతం పలికారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు భూపేష్ బఘేల్, సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా ఆ సభకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ గెహ్లాట్ కరోనా పాజిటివ్ రావడంతో ఆ కీలక నేతలు కూడా ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాగా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధరా రాజేకు కూడా ఇవాళ కరోనా పాజిటివ్గా తేలింది.