న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని రాజస్ధాన్ సీఎం అశోక్ గహ్లాట్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తాను మాట్లాడానని, రెండు రోజుల కిందట రాజస్ధాన్లో జరిగిన పరిణామాలు తమను దిగ్భ్రాంతి కలిగించాయని గహ్లాట్ చెప్పారు. తాను సీఎంగా ఉండాలని కోరుకున్నందుకే ఇలా జరిగిందనే సందేశం వెల్లడైనందున తాను సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పానని గహ్లోట్ వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేపడతారనే వార్తలపై గెహ్లాట్ వర్గీయులు తిరుగుబాటు చేపట్టడంతో అధిష్టానం అప్రమత్తమై గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. రాజస్ధాన్ పరిణామాల నేపధ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయరాదని గెహ్లాట్ నిర్ణయించారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో నిలిచిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దిగ్విజయ్ సింగ్ అభ్యర్ధిత్వాన్ని అధ్యక్ష ఎన్నికల్లో మరో పోటీదారు, పార్టీ ఎంపీ శశి థరూర్ స్వాగతించారు. దిగ్విజయ్ సింగ్ గురువారం తనతో కలిసి మాట్లాడారని, తాము ప్రత్యర్ధులుగా ఈ ఎన్నికల్లో తలపడటం లేదని, సహచరులుగా ఇద్దరి మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.
ఎవరు బరిలో నిలిచినా కాంగ్రెస్ గెలుస్తుందని తాము భావిస్తామని శశి థరూర్ ట్వీట్ చేశారు. మరోవైపు గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడితే రాజస్ధాన్ సీఎం పగ్గాలు చేపట్టాలని ఆశించిన సచిన్ పైలట్ భంగపడ్డారు. రాజస్ధాన్లో తాజా పరిణామాల నేపధ్యంలో సచిన్ పైలట్ గురువారం పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.