ప్రధాని పదవికి మహింద రాజీనామా
నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారుల దాడి
చెలరేగిన హింస.. దేశం మొత్తానికి విస్తరణ
అధికార పార్టీ ఎంపీ సహా ముగ్గురు మృతి
154 మందికి గాయాలు.. దేశవ్యాప్త కర్ఫ్యూ
కొలంబో, మే 9: శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఫలితంగా మొత్తం మంత్రి మండలి రైద్దెంది. మరోవైపు, అల్లర్లతో దేశం అట్టుడుకుతున్నది. ప్రభుత్వ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలతో శ్రీలంక రణరంగంగా మారింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స పదవుల నుంచి దిగిపోవాలంటూ నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్న ప్రజలు సోమవారం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. కొలంబోలో అధ్యక్ష కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. అనంతరం నిరసనకారులు ప్రభుత్వ మద్దతు దారులపై దాడులకు దిగారు. వారి వాహనాలకు నిప్పు పెట్టారు. ఎంపీలు, అధికార పార్టీ నేతల ఇండ్లను ముట్టడించారు. హింస కొలంబో నుంచి దేశమంతటికీ విస్తరించింది.
కొలంబోలో ఆర్మీ
సోమవారం ఘర్షణల్లో అధికార ఎస్ఎల్పీపీ పార్టీ ఎంపీ అమరకీర్తి సహా ముగ్గురు చనిపోయారు. 154 మందికి గాయాలయ్యాయి. శ్రీలంకలో దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కొలంబోలో శాంతిభద్రతల పునరుద్ధరణకు ఆర్మీని రంగంలోకి దించారు. మహింద రాజీనామాకు ముందే శ్రీలంకలో హింసా పర్వం మొదలైంది. దీనిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ‘హింసకు దిగితే అది మరింత హింసకు దారి తీస్తుంది’ అని ట్వీట్ చేశారు. రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబయకు పంపించారు. వీరిద్దరూ అన్నదమ్ములు.
తుపాకీతో కాల్చుకొన్న ఎంపీ అమరకీర్తి
అమరకీర్తి అథుకోరల(57) కారును నిరసనకారులు చుట్టుముట్టారు. ఆయన నిరసనకారులపై తన తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆయన కారును ఎత్తి పడేశారు. తప్పించుకొని పారిపోయిన అమరకీర్తి ఓ భవనంలో దాక్కొన్నారు. వేలాది మంది ఆ భవనాన్ని చుట్టుముట్టారు. అమరకీర్తి ఆ భవనంలోనే తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. ఆయన సెక్యూరిటీ గార్డు కూడా చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టడంలో భాగంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(27) మరణించాడు.