ముంబై: ఎన్నికల విధులను టీచర్లు బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే(Raj Thackeray) తెలిపారు. విద్యార్థులపై ప్రభావం పడనున్న నేపథ్యంలో టీచర్లు ఎలక్షన్ డ్యూటీ వదులుకోవాలన్నారు. శారదాశ్రం స్కూల్కు చెందిన టీచర్ల బృందాన్ని ఆయన కలుసుకున్నారు. ఆ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడుతూ..పోల్ డ్యూటీకి రావాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను ఆయన గుర్తు చేశారు. టీచింగ్ను పణంగా పెట్టి ఎన్నికల విధులకు వెళ్లాల్సిన అవసరం లేదని, టీచర్లు అలా డ్యూటీకి వెళ్తే, ఆ సమయంలో ఎవరు పిల్లలకు చదువు చెబుతారని ఆయన ప్రశ్నించారు. మొదటిసారి ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించడం లేదని, ఆ సంస్థ ఎందుకు స్వంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం లేదన్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని టీచర్లపై వత్తిడి తెస్తున్న ఎన్నికల సంఘంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం ఎలా మీ మీద చర్యలు తీసుకుంటుందో చూస్తానని ఆయన అన్నారు.