Cyclone Michaung | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/చెన్నై : మిగ్జాం తుఫాన్ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నై సహా పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సోమవారం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు రావటంతో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్పోర్టు రన్వేపైకి భారీగా వరదనీరు చేరింది. దీంతో విమాన రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. 16 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు. పదుల సంఖ్యలో విమానాల్ని దారిమళ్లించినట్టు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి వరకు విమానాశ్రయంలో విమాన రాకపోకల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. తుఫాన్ సంబంధిత ఘటనల్లో చెన్నైలో ఐదుగురు మరణించారు.
విద్యాసంస్థలకు సెలవు
2015నాటి తుఫాన్ విపత్తును గుర్తుకుతెస్తూ చెన్నైలో మిజ్జాం బీభత్సం సృష్టించింది. రోడ్డపై పెద్దయెత్తున వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, బ్యాంకులకు మంగళవారం సెలవు ప్రకటించారు.
నెల్లూరు, బందర్ మధ్య..
ఏపీలో కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జాం తుఫాను మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటుతుందని అధికారులు పేర్కొన్నారు. తుఫాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది. తుఫాను తీరం దాటే సమయంలో భారీ విధ్వంసం ఉంటుందని దివిసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను అప్రమత్తతపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు..
రాష్ట్రంలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది.
సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీచేసింది.