న్యూఢిల్లీ, జూన్ 19: ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రాజస్థాన్లో ఐదుగురు మృతి చెందగా, అస్సాంలో 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జోర్హాత్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. మరో మూడురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీచేసింది. భారీ వర్షంతో చెన్నై తడిసిముద్దయింది. విమానాశ్రయం రన్వే పైకి నీరు చేరటంతో, పలు విమానాలు రద్దయ్యాయి. సిక్కిం పశ్చిమ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 100 ఇండ్లు ధ్వంసమయ్యాయి. సింఫోక్లో పలు వంతెనలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. రాజస్థాన్పై బిపర్జాయ్ ప్రతాపం చూపుతున్నది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ప్రజలు బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. వందలాది గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.