Snowfall | హిమాచల్ప్రదేశ్లోని వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పర్వత ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండగా.. సిమ్లా సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షం, మంచు కారణంగా రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది. హిమపాతం నేపథ్యంలో ఆదివారం ఉదయం వరకు నాలుగు జాతీయ రహదారులతో పాటు 518 రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో 478 పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఆఫ్ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కులు, లాహౌల్లో హిమపాతం కురుస్తుండగా.. అటల్ టన్నెల్ రోహ్తంగ్ మీదుగా లాహౌల్కు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం అర్ధరాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో మంచు పడుతున్నది.
ఉత్తర అటల్ టన్నెల్ రోహ్తంగ్లో 15, దక్షిణ పోర్టల్లో 12, సిస్సులో 9 సెంటీమీటర్ల హిమపాతం కురిసింది. వర్షాలు, మంచు కురుస్తుండడంతో ప్రజల కష్టాలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రూట్లలో బస్సులు నిలిచిపోయాయి. దట్టమైన హిమపాతం కారణంగా గిరిజన ప్రాంతం పాంగికి సంబంధాలు తెగిపోయాయి. పాంగిలోని చాలా పంచాయతీలు నాలుగు రోజులుగా అంధకారంలో ఉన్నాయి. పాంగి నుంచి కులు, లాహౌల్ మార్గంతో సహా 19 కనెక్టివిటీ మార్గాల్లో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పాంగిలోని సూరల్లో రెండు అడుగుల మేర మంచు పేరుకుపోగా.. తాజా మళ్లీ హిమపాతంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ధౌలాధర్ కొండలపై మంచు కురుస్తుండగా.. పొగమంచు కారణంగా రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. పాంగిలో హిమపాతం కారణంగా ఈ నెల 11 వరకు కాలేజీకి సెలవు ప్రకటించారు. రెసిడెన్షియల్ కమిషనర్ రితికా జిందాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మండి జిల్లా చలిగాలులతో అల్లాడుతున్నది. ఇప్పటి వరకు జిల్లాలోని 36 రోడ్లు, 100 ట్రాన్స్ఫార్మర్లు, 35 తాగునీటి పథకాలు మంచు కారణంగా మూతపడ్డాయి. సిరాజ్, చౌహర్ఘాటి, నాచన్లోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల అంధకారం నెలకొన్నది. పైపుల్లో నీరంతా గడ్డకట్టపోయి నీటి ఎద్దడితో ఎదురవుతున్నది.
మనాలిలో మంచు కురుస్తోంది. మనాలికి ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు అంగుళాల తాజా మంచు కురిసింది. ప్రతికూల వాతావరణంలో ప్రయాణానికి దూరంగా ఉండాలని పర్యాటకులు, ప్రయాణికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. చిట్కుల్లో 60 సెంటీమీటర్లకుపైగా మంచు కురిసింది. హిమపాతం కారణంగా ఎగువ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. వాతావరణ కేంద్రం సిమ్లా ఈ నెల 5 వరకు మధ్య, ఎత్తయిన కొండప్రాంత జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కులు, చంబా, సిమ్లా, కిన్నౌర్, లాహౌల్-స్పితి జిల్లాల్లో భారీ హిమపాతం నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మైదానాలు, దిగువ కొండ, మధ్య కొండ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం అంచనా వేసింది.