న్యూఢిల్లీ: ప్రయాణికులు తమ పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లే ప్రక్రియను (Pets on Trains) రైల్వే శాఖ మరింత సులభతరం చేస్తున్నది. పెట్స్ కోసం ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించనున్నది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయించింది. దీని కోసం ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని పేర్కొంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)కు ఈ మేరకు ప్రతిపాదనలు పంపింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మార్పులు చేసిన తర్వాత ప్రయాణికులు తమ పెట్స్ కోసం కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
కాగా, ప్రయాణికులు తమతోపాటు పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లేందుకు కొన్ని షరతులు, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏసీ-1 టైర్ కోచ్లోని 2 లేదా 4 బెర్త్ల కూపేల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తారు. మొదటి చార్ట్ తయారైన తర్వాతే ప్రయాణికులు తమ పెంపుడు జంతువుల కోసం ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా పెట్స్కు టికెట్లు బుక్ చేసుకోవాలి. దీని కోసం వారి జర్నీ టికెట్ను తప్పనిసరిగా ధృవీకరించాలి. అలాగే ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం అమలులోకి వచ్చిన తర్వాత పెంపుడు కుక్కలు, పిల్లలను రైళ్లలో తీసుకెళ్లేందుకు టీటీఈ కూడా టికెట్లు జారీ చేస్తారు.
మరోవైపు యజమాని తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నా, పెంపుడు జంతువులతో ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నా, లేక రైలు రద్దు అయినా, మూడు గంటలకు మించి రైలు ప్రయాణం ఆలస్యమైనా పెట్స్ టికెట్ల ఛార్జీ తిరిగి చెల్లించరు. కేవలం ప్రయాణికుల టికెట్లకు మాత్రమే రిఫండ్ ఇస్తారు. అలాగే రైళ్లలో తీసుకెళ్లే పెంపుడు జంతువులకు తప్పని సరిగా టీకాలు వేయించాలి. ఒకవేళ రైలులో ఎవరైనా ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే గార్డ్ ఉండే లగేజ్ కమ్ సీటింగ్ రేక్లోకి ఆ పెట్స్ను తరలిస్తారు.
కాగా, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను ప్రస్తుతం రైళ్లలో తీసుకెళ్లేందుకు ప్లాట్ఫారమ్లోని పార్శిల్ బుకింగ్ కౌంటర్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అలాగే పెట్స్ను లగేజ్ లేదా ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో మొత్తం రిజర్వ్ చేసిన చివరి కూపేలోనే తీసుకెళ్లేందుకు ప్రస్తుతం అనుమతిస్తున్నారు. ఆవులు, గేదెలు, గుర్రాలు వంటి వాటిని గూడ్స్ రైళ్లలో మాత్రమే తీసుకెళ్లవచ్చు. అలాగే వాటిని చూసుకోవడానికి ఒక వ్యక్తి ఆ జంతువుల వెంట ఉండాలి.