Indian Railways | న్యూఢిల్లీ : రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఎక్స్ప్రెస్ స్పెషల్గా మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27 నుంచి పునరుద్ధరించింది కేంద్రం. కరోనా లాక్డౌన్ తర్వాత ఇండియన్ రైల్వేస్.. ప్యాసింజర్ రైళ్లను పేర్లను మార్చడం ప్రారంభించింది. ఆ పేర్లకు తగ్గట్టుగా ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఆర్డినరీ ఛార్జీలు పూర్తిగా మాయమయ్యాయి. దీంతో ఎక్స్ప్రెస్ రైళ్లకు కనీస టికెట్ను ధర రూ. 10 నుంచి రూ. 30కు పెంచడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో సోమవారం రైల్వే బోర్డు సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైళ్ల కనీస టికెట్ ధరను పాత రేట్లులానే వసూలు చేయాలనేది ది చీఫ్ బుకింగ్ రిజర్వేషన్ అధికారులకు మంగళవారం తెల్లవారుజామున సమాచారం అందింది. మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఎంఈఎంయూ)లో ఆర్డినరీ క్లాస్ టికెట్ ధరలు 50 శాతం వరకు తగ్గాయి. సాధారణంగా ఈ రైలు నంబర్లు సున్నాతో మొదలవుతుంటాయి. అన్ రిజర్వ్డ్ ట్రాకింగ్ సిస్టమ్లోనూ వీటి ధరలు అప్డేట్ చేశారు. గతంలో ప్యాసింజర్ రైళ్లుగా సేవలందించి ఆ తర్వాత ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా మారిన అన్నింటికీ ఈ మార్పు వర్తిస్తుంది.
జూన్ 2022లో నైరుతీ రైల్వే మొత్తం 8 ప్యాసింజర్ స్పెషల్స్ను అన్ రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్లుగా మార్చింది. 2021 ఏప్రిల్లో 20 రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చింది. 200 కిలోమీటర్ల దూరానికి మించి ప్యాసింజర్ రైళ్లను నడపకూడదని నిర్ణయించింది. 2020లో మొత్తం 502 ప్యాసింజర్ రైళ్లను మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.