Railways | క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే శాఖ ఇటీవల తమ ఉద్యోగులపై వేటు వేస్తోంది. గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. సంబంధిత వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. బుధవారం ఇద్దరు సీనియర్ గ్రేడ్ అధికారులపై రైల్వే శాఖ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు హైదరాబాద్లో రూ.5లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కగా.. మరో అధికారి రాంచీలో రూ.3లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, రైల్వే శాఖ 2021 జులై నుంచి ఇప్పటి వరకు 139 మంది ఉద్యోగులను బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి పంపించగా.. మరో 38 మంది ఉద్యోగులను విధుల నించి తొలగించనున్నట్లు రైల్వే అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఉద్యోగుల పనితీరుపై కఠినంగా ఉండాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారని సదరు అధికారి తెలిపారు. ఇందులో భాగంగానే 2021 జులై నుంచి ఇప్పటి వరకు రైల్వే శాఖలో పనితీరు సరిగా లేని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులను తొలగించినట్లు చెప్పారు. ప్రతి మూడు రోజులకు ఒక అవినీతి పరుడిని ఇంటికి పంపించినట్లు ఆయన వెల్లడించారు.