Indian Railways | కరోనా మహమ్మారి ఉధృతమైనప్పుడు వృద్ధులకు ఇచ్చిన రాయితీలను నిలిపేయడంతో ఇండియన్ రైల్వేస్కు రూ.1500 కోట్ల అదనపు ఆదాయం లభించింది. దీనిపై సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద మధ్యప్రదేశ్ వాసి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రైల్వేశాఖ ఈ సంగతి తెలిపింది. కరోనా కాలంలో వృద్ధులతోపాటు వివిధ వర్గాల ప్రయాణికులకు ఇచ్చిన రాయితీలను నిలిపివేసి, పూర్తిస్థాయి చార్జీలు వసూలు చేసింది.
2020 మార్చి 20 నుంచి 2021 మార్చి నెలాఖరు మధ్య వృద్ధులకు రాయితీని రైల్వేస్ నిలిపివేశాయి. దీంతో 7.31 కోట్ల మంది వృద్ధులు రాయితీ పొందలేకపోయారు. ఫలితంగా వృద్ధుల ప్రయాణం వల్ల ఇండియన్ రైల్వేస్కు రూ.3464 కోట్ల ఆదాయం లభించింది. వారి రాయితీ రద్దు చేయడంతో రూ.1500 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్లయింది.
రెండేండ్లలో ప్రయాణించిన వృద్ధుల్లో 4.46 కోట్ల మంది పురుషులు, 2.84 కోట్ల మంది 58 ఏండ్లు దాటిన మహిళలు ఉన్నారు. 50 ఏండ్లు దాటిన మహిళలకు 50 శాతం,, 60 ఏండ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ అందిస్తున్నది. మొత్తం ఇండియన్ రైల్వేస్లో 53 రకాల రాయితీలు పౌరులకు లభిస్తున్నాయి. దీనివల్ల ఇండియన్ రైల్వేస్పై రూ.2000 కోట్ల భారం పడుతున్నట్లు తెలుస్తున్నది.