న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సమయంలో భారతీయ రైల్వేకు ఆదాయం సమకూరింది. 2020-2021 సంవత్సరంలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల విక్రయాల ద్వారా రూ.500కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఏడాదిలో తత్కాల్ టికెట్ చార్జీల కింద రూ.403కోట్లు, ప్రీమియం తత్కాల్ టికెట్ల ద్వారా రూ.119కోట్లు రైల్వేశాఖ ఆర్జించింది. డైనమిక్ ఫెయిర్ రూపంలో రూ.511కోట్లు సమీకరించింది. ఈ సమయంలో కరోనా మహమ్మారి కారణంగా రైళ్ల కార్యకలాపాలు భారీగా నిలిచిపోయిన సమయంలోనే రైల్వేకు ఈ ఆదాయం వచ్చింది.
మధ్యప్రదేశ్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన దరఖాస్తు మేరకు రైల్వేశాఖ ఈ సమాచారాన్ని అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైళ్ల నిర్వహణపై ఎలాంటి పరిమితులు లేని సమయంలో రైల్వే డైనమిక్ చార్జీగా రూ.1313 కోట్లు వసూలు చేసింది. తత్కాల్ టిక్కెట్ల ద్వారా రూ.1669 కోట్లు, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల కింద రూ.603 కోట్ల ఆదాయం సమకూరింది.
తత్కాల్ చార్జీలు అన్యాయమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొన్న సమయంలోనే ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థికంగా లేని వారు అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, తక్కువ దూరం అయినప్పటికీ ఎక్కువ చార్జీ వసూలు చేయడం భారంలాంటిదేనని కమిటీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఎంపిక చేసిన రైళ్లలో 2014లో ప్రీమియం టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో 50శాతం టికెట్లను డైనమిక్ ఫేర్ కిందట తత్కాల్ కోటాలో రైల్వే విక్రయిస్తున్నది.