Old Pension Scheme | హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు పోస్టల్, టెలికం, ఇన్కమ్టాక్స్, డిఫెన్స్, డీఆర్డీవో లాంటి కీలకమైక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానం కోరుతూ జాతీయ స్థాయిలో సమ్మెకు దిగబోతున్నారు. ఈ మేరకు మే 1 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. మార్చి 19న అన్ని ప్రభుత్వ రంగాల, సంస్థల శాఖాధిపతులకు సమ్మె నోటీసులు ఇవ్వబోతున్నట్టు ఎస్సీఆర్ ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య, భరణి తెలిపారు.
కొత్త పెన్షన్ విధానానికి నిరసనగా కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో దాదాపు 24 లక్షల మంది పాల్గొననున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నారు. అంటే ప్రస్తుతం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలలో దాదాపు 34 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో దాదాపు 70 శాతం మంది నూతన పెన్షన్ విధానం పరిధిలోకి వచ్చిన వారే ఉన్నారు. దీంతో ఆ వర్గం మొత్తం సమ్మె బాట పట్టబోతున్నారు. ముఖ్యంగా రైల్వేలు, పోస్టల్, టెలికం, ఐటీ, డిఫెన్స్ వంటి ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులంతా సమ్మెకు పూర్తిగా మద్ధతు ఇస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్తో పాటు ఎస్సీఆర్ ఎంప్లాయిస్ సంఘ్, వాటికి అనుబంధంగా ఉన్న పలు సంఘాల సభ్యులు కూడా పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటూ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నారు.