Railway Track | బీహార్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సమస్తిపూర్ జిల్లాలో రైల్వే లైన్ చోరీకి గురైంది. దొంగలు సుమారు రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ను మాయం చేసేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఇద్దరు ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని పాండైల్ రైల్వే స్టేషన్ నుంచి లోహత్ షుగర్ ఫ్యాక్టరీకి అనుసంధానంగా 2 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ట్రాక్ను ఉపయోగిస్తున్నారు. అయితే, షుగర్ మిల్లు పనిచేయకపోవడంతో కొద్ది సంవత్సరాలుగా ఈ ట్రాక్ వినియోగంలో లేదు. మిల్లు మూతపడిన తర్వాత అక్కడున్న సరకుతోపాటు రైల్వే లైన్ను కూడా టెండర్ తీసుకొని, స్క్రాప్గా వేలం వేయాల్సి ఉంది. అయితే, ఇంతలోనే ఆ రైల్వే ట్రాక్ను దొంగలు ఎత్తుకెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న రైల్వే ఉన్నతాధికారులు ఇద్దరు ఆర్పీఎఫ్ ఉద్యోగులపై చర్యలు చేపట్టారు.
జంఝార్పూర్ అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్తో పాటు మధుబని హౌస్కీపింగ్ అసిస్టెంట్ ముకేశ్ కుమార్ సింగ్లను సస్పెండ్ చేశారు. వీరిద్దరూ రైల్వే లైన్ను టెండర్ లేకుండా.. కొందరు వ్యాపారులకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఒకవేళ ఈ కేసులో ఆ ఇద్దరు దోషులుగా తేలితే మాత్రం.. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.