లక్నో: సాధారణంగా రైల్లో ఎంతటి విలువైన వస్తువు పోగొట్టుకున్నా అది తిరిగి దొరుకుతుందనే ఆశ వదులుకోవాల్సిందే. అలాంటిది కేవలం బూట్లు పోయాయనే ఫిర్యాదుతో రైల్వే పోలీసులు తీవ్ర చెమటోడ్చి, నెలరోజులు దర్యాప్తు చేసి దొరకబట్టారు. ఎందుకంటే ఆ బూట్లు పొగొట్టుకున్నామే రైల్వే అధికారి కూతురు. ఈ మె బూట్ల కోసం రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఐఆర్సీటీసీ బృందం కలిసి నెల రోజులు శ్రమించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
ఒడిశాకు చెందిన రైల్వే సీనియర్ అధికారి కుమార్తె అయిన 20 ఏళ్ల యువతి జనవరి 3న ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించింది. ఏసీ కోచ్లో ఆమె నిద్రించిన తర్వాత రూ.10,000 ఖరీదైన బూట్లు మాయమయ్యాయి. దీనిపై ఆమె ఫిర్యాదు చేసింది. జనవరి 4న తెల్లవారుజామున 3 గంటలకు ఉత్తరప్రదేశ్లోని బరేలీ స్టేషన్లో దిగిన ఒక మహిళా ప్రయాణికురాలిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఆ మహిళ పాత బూట్లు వదిలేసి తన బూట్లు ఎత్తుకుపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, ఆ యువతి సీనియర్ రైల్వే అధికారి కుమార్తె కావడంతో ఆమె ఫిర్యాదుపై రైల్వే అధికారులు స్పందించారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కి చెందిన అధికారులు ఒక టీమ్గా ఏర్పడ్డారు. నెల రోజుల పాటు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపారు. రిజర్వేషన్ చార్ట్ ద్వారా బరేలీ స్టేషన్లో దిగిన మహిళను గుర్తించారు. ఆ మహిళ ఢిల్లీలో డాక్టర్గా పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆమెను సంప్రదించి రైల్వే అధికారి కుమార్తె బూట్లు గురించి ఆరా తీశారు.
మరోవైపు రైలు బరేలీ స్టేషన్లో ఆగిన తర్వాత మేల్కొన్న తాను హడావుడిలో పొరపాటున యువతి బూట్లను వేసుకుని దిగినట్లు ఆ మహిళ తెలిపింది. డిమ్ లైట్ వెలుగులో తన బూట్లను గుర్తించలేక వాటిని పోలిన ఉన్న ఆమె బూట్లను వేసుకుని రైలు దిగినట్లు చెప్పింది. ఆ యువతి బూట్లను రైల్వే సిబ్బందికి అప్పగించింది. దీంతో వారు వెంటనే తమ సీనియర్ అధికారి కుమార్తెకు వాటిని పంపారు.