న్యూఢిల్లీ : గుజరాత్లోని సూరత్-బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ రైలును 2026 నాటికి నడపాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామనే విశ్వాసం ఉందని, ఈ మేరకు చాలా పనులు పూర్తి చేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సూరత్లోని చోరియాసి తాలూకాలోని వక్తానా గ్రామ సమీపంలో ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ సెక్షనల్ కాస్టింగ్ యార్డ్ ఆపరేషన్ను సోమవారం పరిశీలించారు. దీంతో పాటు ప్రాజెక్టు కింద నిర్మాణంలో ఉన్న అంటోలి రైల్వే స్టేషన్ను సందర్శించారు.
ఆ తర్వాత రైల్వేశాఖ సహాయ మంత్రి దర్శన్ జర్దోష్తో కలిసి నవ్సారిలోని నసిల్పూర్కు వెళ్లి, అక్కడ ప్రాజెక్ట్ స్థలాన్ని సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహ్మదాబాద్ - ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్కు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని, పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం 61 కిలోమీటర్ల మార్గంలో పిల్లర్లు ఏర్పాటు చేశామని, దాదాపు 150 కిలోమీటర్ల మార్గంలో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మహారాష్ట్రలో ఏడు కిలోమీటర్లు సముద్రం గుండా వెళుతుందని, ఈ లైనులో 12 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో ఎనిమిది గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉంటాయన్నారు. రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి, కొత్త వందేభారత్ రైళ్లు, ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ, బుల్లెట్ రైళ్లు, అల్ట్రా మోడ్రన్, అత్యుత్తమ సేవలు అందించడమే ప్రధాని లక్ష్యమన్నారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది జాతీయ ప్రాజెక్టు అని, ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదని అన్నారు. మహారాష్ట్రలో భూసేకరణ పూర్తయ్యే వరకు గుజరాత్పై దృష్టి సారిస్తామన్నారు.