న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసనకారులు రహదారులను ముట్టడించడంతో పశ్చిమ బెంగాల్లో సోమవారం రోడ్డు, రైలు ట్రాఫిక్ నిలిచిపోయింది.
కేంద్ర ప్రభుత్వ తీరుతో వివిధ రంగాలు దెబ్బతిన్నాయని కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారని నిరసనకారులు మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. హౌరాలో ఫ్యాక్టరీల ఎదుట కార్మికులు జెండాలు చేపట్టి బంద్కు మద్దతుగా ప్రదర్శనలు చేపట్టారు. కార్మిక సంఘాల సమాఖ్య ఇచ్చిన 48 గంటల భారత్ బంద్ పిలుపునకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతు పలికింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, 2021ను వ్యతిరేకిస్తూ సమ్మెకు సంఘీభావం తెలిపింది. కాగా రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితమవుతాయని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక సమ్మె నేపధ్యంలో బొగ్గు, స్టీల్, టెలికాం, పోస్టల్, ఐటీ, బీమా రంగాల్లో సేవలు ప్రభావితమవనున్నాయి.