Rahul Gandhi : బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకుడు కాన్షీరామ్ (Kanshi Ram) కు మరణానంతరం భారతరత్న (Bharat Ratna) పురస్కారం ప్రదానం చేయాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Naredra Modi) ని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకుని, ఆయన సేవలను స్మరించుకుంటూ ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
భారత రాజకీయాల స్వరూపాన్నే కాన్షీరామ్ మార్చారని రాహుల్గాంధీ తన లేఖలో కొనియాడారు. ఉద్యమాల ద్వారా బహుజనుల్లో, పేదల్లో రాజకీయ చైతన్యం నింపారని తెలిపారు. బహుజనుల ఓటు, గళం, ప్రాతినిధ్యం ఎంతో ముఖ్యమని గుర్తుచేశారని, ఈ దేశం అందరిదీ అని చాటిచెప్పారని వివరించారు. ఆయన కృషివల్లే ఎందరో అణగారిన వర్గాల ప్రజలు రాజకీయాలను న్యాయం, సమానత్వం సాధించే మార్గంగా చూడటం ప్రారంభించారని లేఖలో రాశారు.
ప్రతి భారతీయుడికి రాజ్యాంగం సమానత్వం, గౌరవం, భాగస్వామ్యం కల్పించిందని, ఆ హామీలను సమాజంలో అట్టడుగున ఉన్నవారికి అందించేందుకు కాన్షీరామ్ తన జీవితాన్ని అంకితం చేశారని రాహుల్ కీర్తించారు. ఇటీవల లక్నోలో జరిగిన ‘సామాజిక్ పరివర్తన్ దివస్’ కార్యక్రమంలోనూ ఈ డిమాండ్కు బలమైన మద్దతు లభించిందని ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాహుల్ ఈ అంశాన్ని లేవనెత్తడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కాన్షీరామ్కు భారతరత్న ప్రకటించడం ఆయన దేశానికి చేసిన సేవలకు దక్కే నిజమైన గౌరవమని రాహుల్గాంధీ ప్రధానికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. ఆయనను సాధికారతకు చిహ్నంగా భావించే కోట్లాది మంది ఆకాంక్షలను నెరవేర్చినట్టు అవుతుందని రాహుల్ తన లేఖను ముగించారు. అయితే, రాహుల్ డిమాండ్పై బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి దళిత ఐకాన్ల గుర్తింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను ఆమె నిలదీశారు.