న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి హింసాకాండలో బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్నోకు విమానంలో బయలుదేరారు. రాహుల్ గాంధీ వెంట చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్, పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ ఉన్నారు. రైతులపై కేంద్రం, యూపీ ప్రభుత్వం పధకం ప్రకారం దాడి చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా రైతులపై పాలక పక్షం దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. లఖింపూర్ ఖేరిలో రైతులపై జీపు దూసుకువెళ్లడంతో అన్నదాతలలు మరణించారని, బాధ్యులపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు.
ఈ ఘటనలో కేంద్ర మంత్రి, ఆయన కుమారుడిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదని అన్నారు. భూ సేకరణ చట్టం విషయంలో రైతులకు అన్యాయం చేసిన మోదీ సర్కార్ ప్రస్తుతం మూడు వ్యవసాయ చట్టాలతో రైతుల ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. లఖింపూర్ ఖేరిలో సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి ఎస్యూవీ దూసుకుపోవడంతో నలుగురు రైతులు మరణించగా, అనంతరం చెలరేగిన అల్లర్లలో మరో నలుగురు మరణించారు. కాగా ఘటన జరిగిన సమయంలో ఆ కార్లలో తాను కానీ, తన కుమారుడు కానీ లేమని దీనికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెబుతున్నారు.