తిరువనంతపురం, జూన్ 4: కేరళలో 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యాయి! 2024 లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ కూటమికి భారీ విజయం దక్కింది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 20 ఎంపీ స్థానాల్లో యూడీఎఫ్ కూటమి 18 స్థానాల్ని కైవసం చేసుకుంది. వామపక్షాల నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమి ఒక్క స్థానానికే పరిమితమైంది. బీజేపీ తొలిసారిగా ఇక్కడ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ వయనాడ్ నియోజకవర్గంలో 6,47,445 ఓట్లతో గెలుపొందారు. తిరువనంతపురం స్థానంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ 16,077 ఓట్ల మెజార్టీతో (పోలైన ఓట్లు 3,58,155) గెలుపొందారు.
కేరళలో కనీసం ఒక్క ఎంపీ స్థానమైనా గెలవాలని కలలుగన్న బీజేపీ తాజా ఎన్నికల్లో దానిని సాకారం చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సురేశ్ గోపి త్రిసూర్ నియోజకవర్గంలో గెలుపొందారు. 74,686 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సునీల్కుమార్పై విజయం సాధించారు. రాజ్యసభ ఎంపీగా సురేశ్ గోపీ మూడేండ్లపాటు త్రిసూర్పై దృష్టిసారించటం తాజా గెలుపునకు దారితీసింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సురేశ్ గోపీ పెద్ద కుమార్తె వివాహానికి ప్రధాని మోదీ స్వయంగా హాజరుకావటం రాజకీయంగా ఆయనకు బాగా కలిసివచ్చింది.
యూడీఎఫ్ 18
ఎల్డీఎఫ్ 1
బీజేపీ 1