Rahul Gandhi : కాంగ్రెస్ సీనియర్ నేత, బీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్ఫాలో చేశారు. ఆర్పీఎన్ సింగ్ బీజేపీలో చేరిన కొద్ది గంటల్లోనే రాహుల్ ఈ చర్యకు పూనుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సహా ఇతర ముఖ్యులు మాత్రం రాహుల్ బాటలో నడవలేదు. వారందరూ ఆర్పీఎన్ సింగ్ను ఫాలో అవుతూనే వుండటం విశేషం. ఇంతకు ముందు రాహుల్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 280గా వుండేది. అయితే రాహుల్ ఆర్పీఎన్ సింగ్ను అన్ఫాలో చేసే సరికి ఆ సంఖ్య 279కి పడిపోయింది. మరోవైపు ఆర్పీఎన్ సింగ్ ఆయన ట్విట్టర్ కవర్ పేజీని కూడా మార్చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరిన ఫొటోను వుంచుకున్నారు.
యూపీ కాంగ్రెస్లో అత్యంత కీలకమైన నేత, అధిష్ఠానానికి అత్యంత ఆప్తుడిగా పేరు పొందిన ఆర్పీఎన్ సింగ్ మంగళవారం కాంగ్రెస్కు గుడ్బై చెప్పేసి, బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి, యూపీ వ్యవహారాల పర్యవేక్షకుడు ధర్మేంద్ర ప్రధాన్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య సమక్షంలో ఆర్పీఎన్ సింగ్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ గతంతో పోలిస్తే, ఇప్పుడు ఘోరంగా తయారైందని, సిద్ధాంతం విషయంలోనూ ఇలాగే వుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో 32 సంవత్సరాల పాటు పనిచేశానని, అయితే గతంలో వున్న విధంగా ఇప్పుడు లేదన్నారు. భారత్ విషయంలో ప్రధాని మోదీ కన్న కలల కోసం ఓ కార్యకర్తలా పనిచేస్తానని ఆర్పీఎన్ సింగ్ ప్రకటించారు.