న్యూఢిల్లీ: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ కొండల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి సీడీఎస్ బిపిన్ రావత్తోపాటు ఆయన సతీమణి మధులికా రావత్ క్షేమంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు తర్వగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు.
తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కూలింది. త్రివిధదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తన ఫ్యామిలీతో ఎంఐ సిరీస్ హెలికాప్టర్లో వెళ్తున్నట్లు తెలిసింది. నీలగిరి అడవుల్లో కూనురు వద్ద హెలికాప్టర్ కూలినట్లు గుర్తించారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లింది. సీనియర్ రక్షణశాఖ అధికారులతో హెలికాప్టర్ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదంలో ఆర్మీ హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. ఆ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్లు ప్రకటించారు.
ఈ హెలికాప్టర్లో బిపిన్ రావత్ దంపతులతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎన్కే గురుసేవక్ సింగ్, ఎన్కే జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, బీ సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు.