న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పరుగులు పెడుతూ సామాన్యుడికి చెమటలు పట్టిస్తున్న నేపథ్యంలో పెట్రో సెగలపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇంధన ధరలు పెరగకపోతే అది పెద్ద వార్తగా నిలిచే దుస్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ రోజైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుంటే ఆరోజు అది పెద్ద వార్తగా మారుతుండటం మోదీ సర్కార్ ఘనతని ఎద్దేవా చేశారు. పెట్రో ధరల మంటపై కాంగ్రెస్ పార్టీ ఇటీవల దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇక పెట్రోల్ ధరలు శుక్రవారం కూడా లీటర్ కు 27 పైసలు పెరగ్గా, డీజిల్ ధరలు లీటర్ కు 28 నుంచి 30 పైసలు భారమయ్యాయి. తాజా పెంపుతో పలు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు రికార్డు స్థాయికి ఎగిశాయి.