న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో బుధవారం మూడో రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా యంగ్ ఇండియన్ కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్ దర్యాప్తు అధికారులతో స్పష్టం చేసినట్టు సమాచారం.
నేషనల్ హెరాల్డ్ ప్రమోటర్ అయిన కాంగ్రెస్ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కూ ప్రమోటర్ కావడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురిస్తోంది. యంగ్ ఇండియన్ సంస్ధ లాభాపేక్ష లేని కంపెనీ అని కంపెనీ చట్టం ప్రత్యేక నిబంధనల కింద నమోదైందని ఈడీ అధికారులకు రాహుల్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆ సంస్ధ నుంచి తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్ స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే 2010లో కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచి యంగ్ ఇండియన్ ఏ ఒక్క దాతృత్వ కార్యక్రమం చేపట్టలేదని రాహుల్ వాదనను ఈడీ అధికారులు తోసిపుచ్చినట్టు తెలిసింది. యంగ్ ఇండియన్ ఎలాంటి దాతృత్వ పనులు చేపట్టినదని తెలిపే పత్రాలు, ఆధారాలను సమర్పించాలని ఈడీ అధికారులు రాహుల్ను కోరారని ఆ వర్గాలు తెలిపాయి.