న్యూఢిల్లీ : కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. వ్యాక్సిన్ను కోరుకున్న వారందరికీ ఇవ్వరని, అవసరమైనవారికే వ్యాక్సిన్ ఇస్తారని ప్రభుత్వం పేర్కొనడం పట్ల రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అర్ధరహితమైనవని అన్నారు. ప్రతి భారతీయుడు సురక్షితంగా జీవించేందుకు అర్హుడేనని దీనిపై చర్చ అనవసరమని బుధవారం ట్వీట్ చేశారు.
కాగా, మరణాలను నిరోధించడం, వైద్యారోగ్య సిబ్బందిని కాపాడే ఉద్దేశంతో వ్యాక్సినేషన్ చేపట్టామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ కోరుకునే వారికి కాకుండా దాని అవసరం ఉన్న వారికే ఇవ్వడం వ్యాక్సినేషన్ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇక మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 8.4 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించామని అధికారులు తెలిపారు.