Satluj Movie | ప్రముఖ నటుడు, సింగర్ దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లూజ్’ చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్పై తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి సెన్సార్ కోతలు లేకుండా జూలై 3న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో గుట్టుచప్పుడు కాకుండా విడుదలైన ఈ చిత్రం, కేవలం రెండు రోజులకే ప్లాట్ఫామ్ నుండి అకస్మాత్తుగా తొలగించబడింది. ఈ వివాదాస్పద పరిణామంపై దిల్జీత్ దోసాంజ్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో స్పందిస్తూ, ఈ నిషేధం ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందేనని, తాను దీన్ని ముందే ఊహించానని పేర్కొన్నారు. అయితే సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు తెరిచిన తర్వాత ఈ నిర్ణయం ఉంటుందని భావించానని, కానీ ఆదివారం సాయంత్రమే తీసేస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. తాము ఈ సినిమాను కనీసం ప్రమోట్ కూడా చేయకుండా అలాగే విడుదల చేశామని, ఒకవేళ ప్రమోట్ చేసి ఉంటే ఇది రెండు రోజులు కూడా ఓటీటీలో ఉండేది కాదని దిల్జీత్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాము ఏం చెప్పాలనుకున్నామో, ఏ విధంగా చెప్పాలనుకున్నామో అది ప్రేక్షకులకు చేరినందుకు తనకు సంతోషంగా ఉందని, ఇది ప్రేక్షకుల సినిమా కాబట్టి ఎలా వీలైతే అలా డౌన్లోడ్ చేసుకుని అయినా చూడవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
హనీ ట్రెహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, పంజాబ్కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా రూపొందింది. ఆయన 1995లో అపహరణకు గురై, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. మొదట ‘పంజాబ్ 95’ అనే టైటిల్తో రూపొందిన ఈ సినిమా గత మూడేళ్లుగా సెన్సార్ క్లియరెన్స్ కోసం నిలిచిపోయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ఏకంగా 127 కట్స్ ప్రతిపాదించడంతో, ఆ కోతలతో సినిమాను విడుదల చేయడానికి నిరాకరించిన దర్శకుడు, హీరో నేరుగా ఓటీటీ బాట పట్టారు. భారత్లో ఓటీటీ కంటెంట్పై థియేట్రికల్ సెన్సార్ పరిమితులు నేరుగా వర్తించకపోవడంతో, మేకర్స్ దీనిని ‘సత్లూజ్’ అనే కొత్త పేరుతో అన్కట్గా జీ5లో రిలీజ్ చేశారు. అయితే సెక్యూరిటీ కారణాలు, ఐటీ రూల్స్ ఉల్లంఘనలను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జీ5 ఈ చిత్రాన్ని భారత్లో నిలిపివేసింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశం వెలుపల ఉన్న జెడ్5 గ్లోబల్లో మాత్రమే అందుబాటులో ఉంది.