న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేవలం నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలే లాభపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ సన్నిహిత వ్యాపార వేత్తలను ఉద్దేశించి రాహుల్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హయాంలో ఇంధన ధరలు చుక్కలు తాకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముడి చమురు ధరలు అధికంగా ఉన్నాయని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా ప్రజలపై పెట్రో భారాలు మోపుతున్నారని మోదీ సర్కార్పై మండిపడ్డారు.
యూపీఏ హయాంలో ముడి చమరు ధరలు బ్యారెల్కు 140 డాలర్లకు చేరగా, ఇప్పుడవి చాలా తక్కువగా ఉన్నా మనం పెట్రోల్, డీజిల్ ధరలపై అధిక మొత్తం చెల్లించాల్సిన దుస్ధితి నెలకొందని రాహుల్ అన్నారు. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో రాహుల్ శనివారం పర్యటించారు.