Rahul Gandhi | వరుసగా రెండో రోజూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మన దేశంలో చైనా అక్రమంగా నిర్మిస్తున్న వంతెన విషయంలో మోదీ అనుసరిస్తున్న విధానాన్ని దుయ్యబడుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘మన దేశంలో చైనా అక్రమంగా ఓ వంతెన నిర్మాణం చేపడుతోంది. ప్రధాని మోదీ మౌనం కారణంగా చైనా ఆర్మీ మరింత రెచ్చిపోతోంది. ఈ వంతెన నిర్మాణాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారేమోనన్న భయం కూడా నెలకొంది’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని పాంగాంగ్ సరస్సుపై చైనా అక్రమంగా ఓ వంతెన నిర్మిస్తోంది. ఈ నిర్మాణం గనక పూర్తైతే అతి కీలకమైన ఫ్లాష్పాయింట్ విషయంలో చైనా దళాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎనిమిది మీటర్ల వెడల్పున్న ఈ వంతెన ఉత్తర తీరంలోని చైనా సైనిక స్థావరానికి దక్షిణంగా ఉంది. ఉపగ్రహాలు వీటికి సంబంధించిన చిత్రాలను తీశాయి. భారీ భారీ క్రేన్లతో చైనా ఈ వంతెన నిర్మిస్తున్నట్లు ఆ చిత్రాల్లో ప్రస్ఫుటంగా కనిపించాయి.