Rahul Gandhi : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఒక ర్యాలీ కోసం ఖర్గే పాల్గొన్న వేదికను శుభ్రం చేయడాన్ని రాహుల్ తప్పుబట్టారు. అలా చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖర్గే కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో ఒక ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఒక వేదిక నుంచి ప్రసంగించారు.
అయితే, మరుసటి రోజు కొందరు బీజేపీ అనుకూల నాయకులు ఖర్గే పాల్గొన్న ఆ వేదికను పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. శుద్దీకరణ ప్రక్రియ చేపట్టారు. దీనిపై ఖర్గే మండిపడ్డారు. తాను పాల్గొన్న వేదికను పసుపు నీళ్లతో శుద్ధి చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో అక్కడి బీజేపీ ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. తాజాగా ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడారు. ఖర్గే పాల్గొన్న వేదిక ఉన్న ప్రదేశాన్ని శుద్ధి చేయడం అంటరానితనానికి సూచనగా రాహుల్ అభివర్ణించారు. ఈ చర్య దళితులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ల వైఖరికి నిదర్శనం అన్నారు. దళితుల విషయంలో ఆ పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారో తెలుస్తోందన్నారు.
ఈ చర్యకు పాల్పడిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ప్రధాని చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ విషయంలో ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఖర్గే అంశంలో న్యాయం చేయాలని సూచించారు. ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.