శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని చారిత్రక రఘునాథ మందిరంలో 36 ఏండ్ల తర్వాత గురువారం తొలిసారిగా రామ నవమి వేడుకలు జరిగాయి. స్థానిక హిందువులు, ముస్లింలతో పాటు దేశ, విదేశాల నుంచి తరలి వచ్చిన హిందువులు, కశ్మీరీ పండిట్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురి విరాళాలతో ఈ ఆలయాన్ని పునర్ నిర్మిస్తున్నారు.
పునర్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున విగ్రహ ప్రతిష్ఠ ఇంకా చేపట్టలేదు. ముస్లింల సహకారం లేకుండా కశ్మీర్ లోయకు కశ్మీరీ పండిట్ల పునరాగమనం సాధ్యం కాదని ఈ సందర్భంగా గుడి నిర్వహణ కమిటీ జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్ తెలిపారు. కశ్మీరీ పండిట్లు, ముస్లింలు సోదరులని.. శతాబ్దాలుగా తాము కలిసి జీవిస్తున్నామని స్థానిక ముస్లిం గులాం హుస్సేన్ తెలిపారు. జీలం నది ఒడ్డున గతంలో హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకొన్న ఈ తరహా పండుగ వేడుకలను కొందరు ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావోద్వేగం చెందారు.