న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీపార్టీకి (ఆప్) భారీ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మిగిలిన నలుగురు ఆప్ ఎంపీలు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతీ మలివాల్, రాజీందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ తర్వాత బీజేపీలో చేరతారు. పార్టీలో చేరిన ముగ్గురు ఎంపీలకు నబీన్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన రాఘవ్ చద్దా ఒక పార్టీకి చెందిన మొత్తం ఎంపీలలో మూడింట రెండు వంతుల మంది మరో పార్టీలో విలీనం కావచ్చని రాజ్యాంగం చెబుతున్నదని అన్నారు. రాజ్యసభలో ఆప్ను బీజేపీలో విలీనం చేయడానికి సంబంధించి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్కు ఒక లేఖ సమర్పించినట్లు చెప్పారు. లేఖతోపాటు అవసరమైన అన్ని పత్రాలను అందచేసినట్లు చద్దా చెప్పారు. ఆప్కు చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురు బీజేపీలో చేరితే సంజయ్ సింగ్, సంత్ బల్బీర్ సింగ్ సీచేవాల్, ఎన్డీ గుప్తా మాత్రమే మిగులుతారు. మూడింట రెండు వంతుల మంది ఎంపీలు పార్టీ మారితే వారికి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించే అవకాశం లేదు. ఎంపీలు పార్టీని వీడటంపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఎక్స్లో స్పందించారు. పంజాబీలకు బీజేపీ మళ్లీ ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు, విలేకరుల సమావేశంలో అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్తో కలసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాఘవ్ చద్దా ఆప్ రాజ్యసభ ఎంపీల్లో మూడింట రెండు వంతుల మంది బీజేపీలో విలీనం కావడానికి రాజ్యాంగ నిబంధనలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆప్కు రాజీనామా చేసి తాము కూడా బీజేపీలో చేరనున్నట్లు ప్రదీప్ పాఠక్, అశోక్ మిట్టల్ ప్రకటించారు. తన రక్త స్వేదాలతో పెంచి పోషించిన పార్టీ తన వ్యవస్థాపక సిద్ధాంతాల నుంచి పక్కకు తప్పుకుందని చద్దా చెప్పారు. తన 15 ఏండ్ల యవ్వనాన్ని పార్టీ కోసం ధారపోశానని, ఇప్పుడు ఆ పార్టీ తన సిద్ధాంతాలు, విలువలు, నైతిక సూత్రాల నుంచి వేరుపడిందని ఆయన చెప్పారు. వారి పాపాలలో తాను పాలుపంచుకోలదలచుకోలేదని, వారి నేరంలో తనకు ప్రమేయం లేనందున వారి స్నేహానికి తాను అర్హుడిని కానని ఆయన వ్యాఖ్యానించారు.
తమ పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో ఏడుగురు బీజేపీలో చేరిన తర్వాత కూడా బీజేపీ ఆపరేషన్ కమలం చేపడుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ఆరోపించింది. తమ ఏడుగురు ఎంపీలను లాక్కునేందుకు ఈడీ, సీబీఐని బీజేపీ ఉపయోగిస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. చద్దాకు కోరిన పదవులన్నీ ఇచ్చామని, చివరకు బీజేపీ పంచన చేరారని ఆయన విమర్శించారు. భయాన్ని సృష్టించి ఆపరేషన్ కమలాన్ని ప్రారంభించేందుకు బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు.
రాజ్యసభలో పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చద్దాపై ఆప్ వేటు వేయడంతో పార్టీలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. చద్దా స్థానంలో మరో ఎంపీ అశోక్ మిట్టల్ను ఆప్ నియమించింది. అయితే ఆయన కూడా ఇప్పుడు బీజేపీలో చేరారు. కాగా, అశోక్ మిట్టల్కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీతోపాటు ఆయన కార్యాలయాలపై పది రోజుల కిందటే ఈడీ దాడులు నిర్వహించడం గమనార్హం.