న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ను విడుదల చేస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని విమర్శించారు. అయితే ఈ ప్రతిపాదన చేసిన వ్యక్తి పేరు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. మీడియాతో శనివారం మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎర వేసిందని తెలిపారు. ఆప్ను వీడి బీజేపీలో చేరితే సీఎం పదవి ఇస్తామని, కేసులన్నీ ఎత్తివేస్తామని సిసోడియాకు బీజేపీ ఆఫర్ ఇచ్చిందని చెప్పారు. అయితే బీజేపీ ఆఫర్ను కాదన్నందుకే లిక్కర్ స్కామ్తో ఆయనను వేధిస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
కాగా, బీజేపీ ఎప్పుడూ నేరుగా ఆప్ నేతలను సంప్రదించలేదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. స్నేహితులు, పరిచయస్తుల ద్వారా రాజకీయ నేతలను తమ పార్టీలోకి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. ఒకరి నుంచి మరొకరికి, వారి నుంచి మరో వ్యక్తికి, ఆపై స్నేహితులు, పరియస్తుల ద్వారా బీజేపీ ఆఫర్లు చేరుతాయని చెప్పారు. పంజాబ్లో మాదిరిగానే గుజరాత్లో కూడా ఆప్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.