Sharukh Khan: గూఢచర్యం ఆరోపణలతో ఖతార్లో అరెస్టయిన 8 మంది భారత మాజీ నావికులు సినిమా హీరో షారూఖ్ ఖాన్ జోక్యంతో విడుదలయ్యారని, ఈ విషయంలో నరేంద్రమోదీ సర్కారు విఫలమైందని సీనియర్ పొలిటీషియన్, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి విమర్శించారు. ఈ మేరకు ఇవాళ ఖతార్ వెళ్తున్నానంటూ ప్రధాని మోదీ ఎక్స్లో పెట్టిన పోస్టుపై ఆయన స్పందించారు.
‘రానున్న రెండు రోజులు నేను యూఏఈ, ఖతార్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. ఆ రెండు దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన దోహపడుతుంది. పర్యటనలో భాగంగా యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించబోతున్నా’ అని ప్రధాని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రధాని పోస్టుపై సుబ్రమణ్య స్వామి స్పందించారు. ‘మోదీ సినిమా స్టార్ షారూఖ్ ఖాన్ను కూడా తనతోపాటు ఖతార్కు తీసుకుపోయి ఉండాల్సింది. ఎందుకంటే భారత మాజీ నావికులను విడిపించడానికి ఖతార్ షేక్లను ఒప్పించడంలో భారత విదేశాంగ శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు విఫలమయ్యారు. దాంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని షారూఖ్ ఖాన్ను ప్రధాని మోదీ వేడుకున్నారు. షారూఖ్ జోక్యంతో ఖతార్ భారత నావికులను విడుదల చేసింది’ అని పేర్కొన్నారు.
కాగా, 2022లో గూఢచర్యం ఆరోపణల కింద ఇండియన్ నేవీకి చెందిన 8 మంది మాజీ సిబ్బందిని ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, సౌరభ్ వశిష్ఠ్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, ఏపీలోని విశాఖకు చెందిన సుగుణాకర్ పాకాల, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. అక్కడి ప్రాథమిక కోర్టు విచారణ జరిపి వారికి మరణ శిక్ష విధించింది.
ఆ శిక్షను రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దాంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. అప్పీల్పై విచారణ జరిపిన న్యాయస్థానం మరణదండనను సాధారణ జైలుశిక్షగా మారుస్తూ 2023 డిసెంబర్ 28న తీర్పునిచ్చింది. సాధారణ జైలుశిక్షపై కూడా భారత విదేశాంగ శాఖ అప్పీల్కు వెళ్లడంతో గత సోమవారం విడుదలయ్యారు.