మాస్కో : ఉక్రెయిన్పై రష్యా దాడులను స్పెషల్ ఆపరేషన్గా పేర్కొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ యుద్ధాన్ని సమర్ధించుకున్నారు. మాస్కోలోని లుఝింకి స్టేడియంలో వేలాది మంది రష్యన్ పతాకాలు చేబూని పాల్గొనగా వేదికపై పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ ఆపరేషన్ను వెనకేసుకొచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ వార్తో ఆర్ధిక విపత్తును ఎదుర్కోకతప్పదని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ శుక్రవారం హెచ్చరించాయి. రష్యా దండయాత్రను మానవ విధ్వంసంగా అభివర్ణించాయి.
రష్యా-ఉక్రెయిన్ వివాదంతో ఇంధన, ఆహార సరఫరాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫలితంగా పేదరికం పెరుగుతుందని సంయుక్త ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశాయి. వృద్ధి మందగమనం, వాణిజ్య అడ్డంకులు, ధరల మంట వంటి పలు ఇబ్బందులు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను చుట్టుముడతాయని స్పష్టం చేశాయి. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పలు ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై రష్యా బలగాలు కాల్పులతో విరుచుకుపడుతున్నాయి.
రష్యన్ బలగాల దాడుల్లో తూర్పు ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. ఖర్ఖీవ్లోని ఓ బహుళ అంతస్తుల టీచింగ్ భవనంపై కాల్పులు జరిగాయని తెలిపింది. ఇక క్రమటోస్క్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా ఆరుగురు గాయపడ్డారని గవర్నర్ పాలో క్రిలెంకో ఆన్లైన్ పోస్ట్లో వెల్లడించారు. రష్యా బలగాల కాల్పుల హోరుతో పలు పట్టణాలు, గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించే ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఉక్రెయిన్ తూర్పు లుహంక్ ప్రాంత గవర్నర్ పేర్కొన్నారు.