Purnesh Modi – Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టులో బుధవారం కేవియట్ దాఖలు చేశారు. గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీల్ను విచారించాలని ఆయన కేవియట్లో కోరారు. రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్ను గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ జులై 7న తిరస్కరించిన విషయం తెలిసిందే.
కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేస్తే.. తన వాదనలను సైతం వినాలని పూర్ణేష్ మోదీ తన న్యాయవాది పీఎస్ సుధీర్ ద్వారా కేవియట్ దాఖలు చేశారు. 2019 కర్ణాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ఇంటిపేరునుద్దేశించి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ను దోషిగా పేర్కొంటూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత సూరత్ సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా శిక్షపై స్టేను విధించేందుకు నిరాకరించాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ క్రమంలో పూర్ణేష్ మోదీ కేవియట్ దాఖలు చేశారు.